బాలమురళీకృష్ణ గారి తిల్లానా

జూన్ 17, 2008

మనవాడు అని మనం గర్వంగా చెప్పుకోదగ్గ వారిలో డాక్టర్. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ప్రముఖులు. దాదాపు 15 - 20 ఏళ్ళ క్రిందట తితిదే వారు  శ్రీ బాలమురళీకృష్ణ గారి గాత్రములో త్యాగరాజ పంచరత్నాలు క్యాసెట్ల రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. పంచరత్నాలతో పాటు అందులో తిల్లానా కూడా ఉండేది. దాదాపు రోజూ వినటం వల్ల అప్పట్లో అవి చాలా వరకు నోటికి వచ్చేవి. ముఖ్యంగా నాకు సంగీతంలో ప్రవేశం లేకపోయినా, ఆయన పాడిన తిల్లానాలో ఏదో ఓ ప్రత్యేకత అనిపించేది. అలా 15 ఏళ్ళప్పుడే నేను ఆయన అభిమానినయిపోయాను.

శాస్త్రీయ సంగీతం పట్ల పెద్దగా ఆసక్తి లేని వారికి కూడా బాలమురళీకృష్ణ గారు పాడిన తిల్లానా ఆ అసక్తి కలగచేయగలదని నాకనిపిస్తుంది. నా భజనకీర్తనలు బ్లాగులో గంధము పుయ్యరుగా కీర్తన కోసం వెతుకుతుంటే, ఈ తిల్లానా అగుపడింది. మీతో ఇలా పంచుకోవాలనిపించి, ఇదిగో ఇలా ఈ టపా రాస్తున్నాను.

ముందుగా బాలమురళి గారి గూర్చి వారి శిష్యులు శ్రీ రామ వర్మ వారి నోటి నుంచి నాలుగు మాటలు.

ఆపై ఈ తిల్లానా వినండి.


విమానాల్లో “బొద్దు”గుమ్మలు

జూన్ 6, 2008

మా బంధువుల్లో ఒకమ్మాయి బొద్దుగా ఉండేది. ఎవరన్నా ఆట పట్టిస్తే, బొద్దుగా ఉన్నానని నవ్వుతారేమిటి, ఎముకలు బయటపడే పీల తనం కన్నా, అసలు బొద్దుగా ఉంటేనే అందం తెలుసా అనేది. అంతే కాదు, అలనాటి మహానటి సావిత్రిని గుర్తు చేసి, సావిత్రి బొద్దుగా ఉంటేనే జనాలు ఇష్టపడ్డారని ఎదురు వాయించేసేది. సావిత్రిని తెలుగు వాళ్ళు ఇష్టపడింది బొద్దుగా ఉండటం వల్ల కాదమ్మా ఆవిడ నటన వల్ల అన్నది ఆవిడతో వాగ్వివాదంలో ఒప్పించి మనం గెలవలేమనుకోండి. అసలు సంగతి అదికాదు.

మరేమిటి అంటే మన ఎయిర్ ఇండియా వారు వారి విమానాల లోపల పనిచేసే సిబ్బందిని ముఖ్యంగా ఎయిర్ హోస్టెసు లను పరిమితికి మించి బరువు పెరిగితే (చాలా మంది అప్పటికే పరిమితి మించారన్నది వేరే సంగతి, అలాంటి వారిని బరువు తగ్గమన్నారు) వారిని గ్రౌండ్ డ్యూటీలకి మారుస్తామని హెచ్చరించారుట. ప్రభుత్వ రంగ సంస్థ గదా, ఎవరూ లెక్క చెయ్యలేదు సరికదా ప్రభుత్వం మీదే కేసు పెట్టార్ట కోర్టులో. (మేము లావుగా ఉన్నా చేసే పనిలో ఏ తేడా రాకుండా చేస్తున్నామని). అయినా పరుగెత్తాల్సిన పోలీసులే ఇంతలేసి పొట్టలేసుకొని పోలీసు శాఖలో నిక్షేపంగా ఉద్యోగాలు చేసుకుంటుంటే, కుళ్ళు కాకపోతే 200 అడుగుల విమానంలో అటూ ఇటూ తిరిగుతూ ప్రజలకి సేవలు అందిస్తున్న మా మీదే ఎందుకీ కక్ష సాధింపు అని వాళ్ళు అనుకుంటూండొచ్చు.

గట్టి వాదనే. కానీ వచ్చిన చిక్కల్లా ఆ ముక్క అనాల్సింది ప్రయాణిస్తున్న ప్రయాణీకులు గానీ వారు కాదు కదా. ఓ పక్కన తోటరాముడు మల్లె తీగల్లాంటి సేవికలున్నారని కింగ్ ఫిషర్లో, జెట్లలో తానొక్కడే ఊళ్ళు తిరిగెయ్యటమే కాకుండా, పనిగట్టుకుమరీ ఇతరుల్ని రెచ్చగొట్టి ఎయిర్ ఇండియా/ఇండియన్ విమానాలు ఎక్కటమంత దురదృష్టకరం మరోటి లేదన్నట్లు చెప్తున్నాడు. ఇలా అయితే, భారీకాయాల సేవికలున్న ఎయిర్ ఇండియా/ఇండియన్ విమానాల్ని ఎవరు ఎక్కుతారు చెప్పండి? ఇన్నాళ్ళూ అంటే ఏదో పెద్ద వాళ్ళూ, పెద్ద వయసు వాళ్ళు లేదా మరో ఎయిర్ లైన్సు గతి లేక ప్రయాణించారు అంటే అర్ధం ఉంది. ఇప్పుడలా కాదే? విమానాలు ఎక్కే వాళ్ళలో కుర్రకారు ఎక్కువైపోయారు. సవాలక్ష విమాన కంపనీలు. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి పనితనంతో పాటు రూపు కూడా అవసరమే. తమ అస్థిత్వానికే ప్రమాదమొచ్చే పరిస్థితి కాకపోతే, మన ప్రభుత్వం వారి ఆధ్వర్యంలోని ఎయిర్ లైన్సు వారు ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోరు కదా. కోర్టు కూడా వాస్తవ స్థితి గ్రహించినట్లుంది. ఒళ్ళు తగ్గాల్సిందే నంటూ జారీ చేసిన హుకుం సమర్ధించింది.

ఈ రోజుల్లో బొద్దుగా ఉండటం ముద్దు కాదని ఎలా వీళ్ళకి చెప్పటం చెప్మా?

** మన కవులు ఎక్కడో స్త్రీలు బొద్దుగా ఉండటాన్ని మెచ్చుకున్నారని గుర్తు. ఎవరికైనా గుర్తుందా ఏ సందర్భంలోనో?


బత్తీబంద్ పై నా అభిప్రాయాలు

మే 29, 2008

బత్తీబంద్ పై నా అభిప్రాయాలు ఇలా గతవారం ఇక్కడ పంచుకున్నాను.