ఇదిగో నా మొదటి పద్యం….
రానారె గారి సమస్యకి ఊదం గారి ఈ పూరణతో ప్రేరితుడనై, నేను చివరికి నా మొదటి పద్యాన్ని అదే సమస్యకి పూరణతో ప్రారంభిస్తున్నాను. పురాణాలు పక్కన పెట్టి కర్ణుడు ఓ కుటుంబంలో కొడుకుగా భావిస్తూ, ఈ పద్యం రాసాను.
జననికి ముదముం గూర్పగ,
జనకుడు బోయె సంతకు జున్నును కొనగ,
తనయేమో బోయె బంతాటకి,
తనయుడు కర్ణుడు చేసె తల్లికి సేవల్!
మొదటి పాదము మళ్ళీ కాస్త మార్చాలనిపించి ఇలా రాసాను.
జననికి మోదము ఖాయము
……
ఇక అక్షింతలో, లక్షింతలో …. మీదే ఆలస్యం.
*******************************************************************************
మలి సవరణ
జననికి ముదముం గూర్పగ,
జనకుడు బోయెను కొనుటకు చక్కని కెంపుల్,
తనయటు పో(న్)బంతాటకి,
తనయుడు కర్ణుడు ఒనర్పె తల్లికి సేవల్!


8:17 అపరాహ్నం వద్ద అక్టోబర్ 20, 2007
శభాష్ ! చాలా మంచి పూరణం వ్రాశారు , ఇలా ఒక్కొక్కరు రెండేసి పద్యాలా ఒక్కో పూరణికి…. ఊరించి ఊరించి చాలా మంచి పద్యం వ్రాశారు.
8:36 అపరాహ్నం వద్ద అక్టోబర్ 20, 2007
రెండవ పాదం,చివరి పాదం చంధస్సు సరిపోలేదు. ప్రయత్నించండి , సరైన పద్యం వచ్చేస్తుంది. ఒకసారి చందస్సు చూసుకోండి. చాలా మంచి ప్రయత్నం
8:39 అపరాహ్నం వద్ద అక్టోబర్ 20, 2007
బ్లాగేశ్వరుడు గారు,
చాలా కాలం తర్వాత ఓ పరీక్ష రాసి, ఫలితాల కొరకు వేచి చూసే పిల్లాడి పరిస్థితి నాదయిందంటే నమ్మండి. రానారె గారి తాటకి నిజంగా నా తాట వలిచింది. మీరు చెప్పిన విషయములు నిషిద్ధ “జ” గణము గుర్చి అని గ్రహించాను. నెనర్లు. ఇప్పుడు సవరణ పైన చూడండి. మళ్ళీ తప్పయితే, వివరించగలరు, ఎందుకయినదో తప్పు.
9:18 అపరాహ్నం వద్ద అక్టోబర్ 20, 2007
జ కి జు కి యతి మైత్రి కుదరదు కాబట్టి, జడ కొప్పులే ఆమోదములు.
జడకొప్పుల కోసం జున్నుని కాలదన్నడం బహుశా ఇక్కడొక్క చోటే చూస్తానేమో..
9:22 అపరాహ్నం వద్ద అక్టోబర్ 20, 2007
చెప్పడం మర్చా, తాటకి ని బంతాటకి ని చేసిన మీ చమత్కారం బావుంది. పద్యం చాలా సుళువుగా అర్ధమయ్యే రీతిలో రాసారు..
12:52 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 21, 2007
@గిరి,
ఆడవాళ్ళు జున్ను కన్నా జడకొప్పులకే విలుఎక్కువ ఇస్తారు లెండి. జ,జు ల యతిమైత్రి నాకూ అనుమానమే వచ్చింది. కానీ, సుమతీ శతకములో ఈ పద్యము చూడండి.
నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ
ఇది చూసి అలా ప్రయత్నించాను. నెనర్లు.
2:21 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 21, 2007
సుమతీ పద్యంలో మీరన్నది ఆఖరి పాదం గురించి అయితే నుకి నొకి మైత్రి ఉంది; (ఉ, ఊ, ఒ, ఓ) మైత్రి అచ్చులు.
మూడో పాదం గురించి అయితే, కందంలో 2,4 పాదాలకేగా యతి మైత్రి వర్తించేది?
2:47 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 21, 2007
చివరి పాదం గూర్చే. ఓ అదా సంగతి. కరక్టే. కృతజ్ఞతలు
3:09 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 21, 2007
వికటకవి గారు ,మీరు జ గణం UIU అనుకొని పొరబడుతున్నారు.జగణం IUI రెండవ పాదం& చివరి పాదం సరిచేయండి.
5:00 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 21, 2007
@బ్లాగేశ్వరుడు,
నేను జ గణం పొరపడలేదు అనే అనుకుంటున్నా. కానీ, మొదటి సవరణ(అవసరమే)లో 2,4 పాదాల్లోని 2,4 గణాల్లో జ గణం తీసేసాను. ఇప్పుడు రెండవ సవరణలో మళ్ళీ 2,4 పాదాల్లో మూడో గణం జ గణం అయ్యేట్లు చూసుకున్నాను. ఒడ్డునపడ్డట్లేనా?
3:33 అపరాహ్నం వద్ద అక్టోబర్ 22, 2007
వికటకవి గారు,
జనకుడు కొన వెళ్ళెను చన్ద్రహారమున్ - ఈ పాదం లో ౫ (5) గణాలు సరిపోవటమ్ లేదు కొంచం చూడండి.
4:42 అపరాహ్నం వద్ద అక్టోబర్ 22, 2007
విటకటవిగారూ, పేరుకు తగ్గట్టుగా కాస్త వెరయిటీ చూపించారు. మొదలెట్టారు కనుక మీకు మరింత స్ఫూర్తిని కలిగించే మా గురువుగారి ఉవాచ ఒకసారి చూడండి.
5:02 అపరాహ్నం వద్ద అక్టోబర్ 22, 2007
ఊదం గారు, చాల కృతజ్ఞతలు. విషయం గ్రహించాను. గణ విభజనలో ఒక ముఖ్య సూత్రం మరచిపోయా. ద్విత్వం మరియు సంయుక్తాక్షరాల ముందు అక్షరం కూడా గురువు అన్న సంగతి. అదే తేడా చేసింది. దారి చూపినందుకు నెనర్లు. ఈ సారి మళ్ళీ కుస్తీ పట్టొస్తా.రానారె గారూ, మీ లంకె కు కృతజ్ఞతలు.
8:24 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2007
ఒకటవ పాదం సరిపోయింది, రెండవ పాదం లొ మూడొ గణం జ గణం గాని నల గాని రావాలి, రెండు మూడు గణాలు ఇటు అటు చేస్తే అక్కడ నల గణం వస్తుంది. మూడవ పాదం లొ గణాలు ఎక్కువై పోయాయి. నాల్గవ పాదం సరిపోయింది. కొంచెం చూడండి.
8:53 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2007
@బ్లాగేశ్వరా,
రెండో పాదం గణాలు వరసగా నల(జనకుడు),న(కొనుట),జ(కుపోయె),భ(చక్కని),గగ(కెంపుల్)
ఇది బాగానే ఉంది కదా? అయినా మార్చాలా?
మూడు పాదం ఇప్పుడు, తనయయు(నల), బోయె బం(త),తాటకి(భ)
9:14 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2007
కందం లొ ఉండేవి ఐదు గణాలు మాత్రమే, గగ అంటే అది ఒక గణం, భ ఒక గణం, జ ఒక గణం, స ఒక గణం, నల ఒక గణం, గగ ని , నల ని విడగొట్టడనికి లేదు. ఇప్పుడు పరిశీలిస్తే మార్పులు చెయ్యాలని మీకే అర్థం అవుతుంది. రెండవ పాదం లొ జనకుడు పోయెను కొనుటకు చక్కని కెంపుల్ అంటే సరిపోతుంది. మూడవ పాదం సంగతి కవిగా మీరే చూడండి. ఒకసారి వికీపీడీయాలొ కందం వ్యాసం చూడండి. పట్టు విడవకండి.
10:38 అపరాహ్నం వద్ద అక్టోబర్ 23, 2007
@బ్లాగేశ్వరా,
మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టనేమో. క్షమించండి. చాలా చాలా కృతజ్ఞతలు. తెలుసుకున్నదేమంటే, నేను మరింత శ్రద్ధగా చదవాలి సూత్రాల్ని. కందానికి ఆ గణాలు మాత్రమే వర్తిస్తాయి అన్నది సరిగా చదవలేదు. మార్పులు చేసాను. దయచేసి చూడండి.
దుమ్ము రేపిందండీ మూడో పాదం. నేను రాస్తూండగానే మీ కామెంట్ వచ్చింది. అయిందనేఅనుకుంటున్నా మరి ఇప్పుడు.
7:03 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 24, 2007
vikaTakavi gAru,
abhinaMdanalu.. modaTi padyamlonE maMci samasyanu pUriMcAru..
7:19 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 24, 2007
ఆద్యము జేసెగనుకనిక
గద్యము తోడ వికటకవి కలము వ్రాయున్
పద్యము అడపాదడపా
పద్యము పాదరసముగ పలువుర కంటా
7:42 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 24, 2007
బ్లాగేశ్వరులు,గిరి మరియు ఊదం గార్లతో సహా నా మొదటి పద్యం పూర్తికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.
5:33 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 25, 2007
బ్లాగేశ్వరులు,కలము వ్రాయున్ అంటే ‘ము’ గురువు కాదనుకుంటా..
10:56 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 25, 2007
@ఊకదంపుడు గారు ఇంకో తప్పు కూడా ఉన్నది. నాల్గవపాదం గణాలు సరిపోలేదు. నా కలానికి వ్రాయలని దురద, వ్రాస్తే నేమో సరిగా పడదు. అందుకే కలానికి కొద్ది రోజులు ఇంకు పొయ్యడం లేదు.